సహవాసం అనగా మనము ఇతరులతో కలిగియుండే ఆరోగ్యకరమైన, స్నేహపూర్వకమైన సంబంధము. ఈ భూమి మీద ఉన్న నిజ క్రైస్తవులు అందరూ ఒకరితో ఒకరు సహవాసము కలిగియుండి, విశ్వాసులని పిలువనడునట్లు దైవ బాంధవ్యాన్ని కలిగిఉండాలి. ప్రభువైన యేసు క్రీస్తువారిలో మనకున్న గొప్ప విశ్వాసమే మనలను తండ్రితోను, ఇతర విశ్వాసులతోను సంపూర్ణ సహవాసము కలిగియుండునట్లు చేస్తుంది. భూమి మీద ఎన్ని సంఘములు ఉన్నను, క్రీస్తును రక్షకునిగా అంగీకరించిన మనమంతా ఒక్కటే కుటుంబమై యున్నాము. కనుక మనలో ఒకరిమధ్య ఒకరికి దైవిక మరియు ఆత్మీయ సహవాసము తప్పక ఉండాలి. యోహాను 13:34-35 లో యేసు ఇలా చెప్పారు, మీరు ఒకరి నొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను; నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీని బట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురనెను.
మనము ఒకరితో ఒకరము సమాధానంగా ఉండుటకును, దైవిక ప్రేమ కలిగియుండుటకును, అనురాగము కలిగియుండుటకును, ప్రోత్సాహపరుచుకొనుటకును యేసు క్రీస్తు వారు రక్తమిచ్చి సంఘముగా మనలను ఏర్పరచెను కానీ ద్వేషించుటకు, అల్లరులుకు, దైవ వ్యతిరేక క్రియలను, పోకిరి చేష్టలకు, అల్లరి సంబంధమైన ఆట పాటలకు, ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు బ్రతుకుటకు ఎంతమాత్రం కానే కాదు. క్రీస్తు శిరస్సు అయి ఉండగా, సంఘం ఈ భూమిమీద ఆయన శరీరముగా ఉన్నది. కనుక ఈ శరీరమును దాని విలువను పాడుచేసే అవయవములుగా కాక, సాటి క్రైస్తవులను, సంఘములను,ప్రేమించుచు మంచి సహవాసముగల వారమై యుందుము. యేసుక్రీస్తును విశ్వసించని లోకములో ఉన్న ఇతర మనుష్యులపై కూడా క్రీస్తు ప్రేమను చూపి, చక్కని సహవాసమును కలిగియుందుము. సర్వశక్తిమంతుడైన తండ్రి, పరిశుద్ధాత్మ వలన మనలను ప్రేరేపించి , యేసు వారి పవిత్ర నామమున మనకు అట్టి సహవాసపు మనసు దయచేయును గాక - ఆమెన్.
విశ్వాసముతో ప్రార్థించుట
నిజ క్రైస్తవుని యొక్క ఆత్మీయ ఎదుగుదలకు ప్రార్థన ప్రధానమై యున్నది. ప్రార్థన మనలను దేవునితో అన్యోన్య సహవాసము కలిగియుండుటకు సహాయము చేస్తుంది. క్రైస్తవ జీవితములో ఉన్నతముగా ఎదగాలి అనుకునేవారు తప్పనిసరిగా ప్రార్థనా జీవితమును కలిగియుండి దానిని అభివృద్ధి చేసుకోవాలి. మత్తయి 6:5,6 లో ప్రభువైన యేసు ఇలా చెప్పారు. ప్రార్థన చేయునపుడు మనము వేషధారుల వలే ఉండకూడదు.దేవుని ఎదుట నటించకూడదు. ఎందుకనగా ఆయన అందరు మనుష్యులను వారి ఆంతర్యములను ఎరిగినవారు. ప్రార్థనలో మనము వ్యర్థమైన మాటలు వచింపరాదు. విశ్వాసముతోను సంపూర్ణ సమర్పణతోను మనము ప్రార్థన చేయవలెను. ప్రార్థనలో మొదట మనము తండ్రి నామమును స్తుతియించాలి, రెండవదిగా మన పాపములను ఒప్పికోవాలి, మూడవదిగా దేవుడు మనకు చేసిన మేలులకై ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి, నాలుగవదిగా మన ప్రార్థనా విన్నపములను పరిశుద్ధాత్మ సహాయముతో తండ్రికి విన్నవించాలి, చివరిగా మన రక్షకుడైన ఏసుక్రీస్తు వారి నామమును ఘనపరుస్తూ ఆయన పవిత్ర నామములో మన ప్రార్థనలు సమర్పించాలి. ఇట్టి ప్రార్థన ఫలభరితమైన ప్రార్థనయై యున్నది. అట్టి ప్రార్థన శక్తిని, ఆత్మ బలమును మన తండ్రి యేసు క్రీస్తు వారి నామమున మనకు దాయచేయును గాక - ఆమెన్.
యోహాను 15:7లో ప్రభువైన క్రీస్తు ఇలా చెప్పారు, నాయందు మీరును, మీయందు నా మాటలును నిలిచియుండాలి అని. ఒక మంచి విశ్వాసిగా, శిష్యునిగా ఎదిగి, ఆత్మీయలోతులలోనికి వేరుతన్ని, ఫలించాలి అంటే మనలో తప్పక క్రీస్తు వాక్యము నిలిచియుండాలి. క్రీస్తు వాక్యమందు నిలిచియున్నవారే ఆయనకు నిజమైన శిష్యులు, సత్యమును గ్రహించినవారు అని యోహాను 8:31లో ప్రభువైన యేసు చెప్పారు. క్రీస్తు యేసు మనలో నివసించాలి అంటే ముందుగా మనము ఆయన వాక్యంలో నిలిచియుండాలి. దైవ వాక్యము మన ఆత్మీయ జీవితాలకు జీవాహారమైయున్నది. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదుగాని, దేవునినోట నుండి వచ్చు ప్రతీ మాట వలనను జీవించును అని మత్తయి 4:4లో ప్రభువు చెప్పియున్నారు.ఆలాగుననే ఆయన మాటలు(వాక్యం) వినుట వలన, అలా వినినటువంటి మాటలు మనలో నిలుపుకొనుట వలన మనకు విశ్వాసం కలుగుతుంది అని రోమా 10:17లో చెప్పబడియున్నది. మనలో ఈ విశ్వాసమును చూచి దేవుడు మనలను ఇష్టపడుచున్నట్లుగా హెబ్రీ 11:6 లో మనము చూడగలము. ఈ దైవవాక్యము వినుట వలనను, చదువుట వలనను, అధ్యయనం చేయుట వలనను, కంఠతము చేయుటవలనను, మరియు ధ్యానించుట వలనను మన జీవితాలకు వీటిని అన్వయించుకుని వాక్యానుసారమైన జీవితములు కట్టుకొనగలము. కనుక ఆ వాక్యమందు నిలిచియుండు విషయములో మనము ఏలాగునున్నామో మనలను మనమే ఒకసారి పరీక్షించుకుందాం. దేవుని వాక్యము మన జీవితాలను రూపాంతరం చెందించగల శక్తి కలిగియున్నది. అంతమాత్రము కాక మన ఆలోచనలను మన జీవిత విధానాలను సరిచేయునదైయున్నది. కనుక క్రీస్తు వాక్యమందు నిలిచి ఫలియించునట్లు దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయును గాక - ఆమెన్.
- Glp Rajesh Babu

Comments
Post a Comment