నన్ను ఎవరూ అర్ధం చేసుకోవడంలేదు
![]() |
| GLP Rajesh Babu |
ఈ విషయాలలో మనము ఇతరులెవరిని నిందించవలసిన అవసరం లేదు కానీ, మనమేమిటో మనలను మనం అర్ధం చేసుకోవలసిన వారమై యున్నాము. మనలను మనమే అర్ధం చేసుకోలేకపోతే ఇతరులు మనలను అర్ధం చేసుకునేట్లు వారితో మనము ఏలాగు మెలగగలము? మనము ఎవరి గురించి చింతించవలసిన అవసరం లేదు, మనలను అర్ధం చేసుకోవడం లేదని ఎవరినీ నిందించవలసిన అవసరం లేదు.
సాధారణంగా మానవులందరు, సాటివారు తమను అర్ధం చేసుకోవాలని కోరుకుంటారు. భార్య తనని అర్ధం చేసుకోవాలి అని భర్త, భర్త తనని అర్ధం చేసుకోవాలని భార్య, తల్లితండ్రులు తమను అర్ధం చేసుకోవాలని పిల్లలు, పిల్లలు తమను అర్థం చేసుకోవాలని తల్లితండ్రులు ఇలా మంచి సత్సంబంధాలు కలిగిన వారంత ఒకరినొకరు అర్ధం చేసుకోవాలి అని ఆశిస్తారు.
అలాంటివారు లేనప్పుడు లేక దూరముగా ఉన్నప్పుడు విపరీతమైన మానసిక ఆందోళనకు గురి అవుతూ ఉంటారు.దాని వలన మానసిక అశాంతి, శారీరిక సమస్యలు, చెప్పుకోలేని కలహములు జీవితంలో చోటుచేసుకుంటాయి. కొన్నిసార్లు ఈ ఆలోచన ధోరణి, ఒంటరితనము లోనికి, ఆతరువాత ఆత్మహత్య చేసుకోవాలి లేదా ఎవరికైనా హాని చేయాలి అని ప్రేరేపించే అవకాశం కూడా ఉంది. మరికొన్ని సార్లు ధూమపానం, మద్యపానం మరియు ఇతర అసహ్య కార్యాలకు దారి తీస్తుంది.
అయితే ఇక్కడ మనకు అన్ని సందర్భాలలో తోడుండి, మనల్ని సరిగా అర్ధం చేసుకోగలిగిన, మన మాటలను ఓపికతో అలకించగలిగిన వారు ఒకరు ఉన్నారు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. అవును ఆయనే మనలను చక్కగా అర్ధం చేసుకుని సరైన మార్గంలో నడిపించగలిగిన వారై యున్నారు. ఆయన మనలను సృష్టించిన సృష్టికర్తగా , మనలను ప్రతిక్షణం కనిపెట్టుకుంటు, మనలను సంపూర్తిగా అర్ధం చేసుకొనగలవారై యున్నారు.
దానికోసం ఆయన ఈ బూమిమీదకి వచ్చి మనలో ఒకడిగా జీవించి సమస్తము జీవిత విధి విధాన విషయాలను అనుభవించి అవగాహన చేసుకుని మనకు సహాయకర్తగా ఉన్నారు.
వాక్యము ఇలా వ్రాయబడింది.
(హెబ్రీయులకు 2 :14-15)
------------
కాబట్టి ఆ పిల్లలు రక్తమాంస ములు గలవారైనందున ఆ ప్రకారమే మరణముయొక్క బలముగలవానిని, అనగా అపవాదిని మరణముద్వారా నశింపజేయుటకును,
జీవితకాలమంతయు మరణభయము చేత దాస్యమునకు లోబడినవారిని విడిపించుటకును, ఆయనకూడ రక్తమాంసములలో పాలివాడాయెను.
(హెబ్రీయులకు 4 :15,16)
------------
మన ప్రధానయాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయముకొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము.
(హెబ్రీయులకు 2: 18)
-------------
"తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడువారికిని సహాయము చేయ గలవాడై యున్నాడు."
యేసుక్రీస్తు వారి జీవిత అనుభవాలు చూడగలిగితే:
1. మార్కు 3:21, యోహాను 7:5 ప్రకారం ఆయన కుటుంబం ఆయనను అర్ధం చేసుకోలేదు.
2. మత్తయి 26:56 ప్రకారం ఆయన స్నేహితులు ఆయనను అర్ధం చేసుకోలేదు.
3. మత్తయి 26:46, మార్కు 14:45 ప్రకారం ఆయన కూడా నమ్మకంగా ఉన్నవాడు మోసం చేసి ఆయనను అమ్మివేశాడు.
4. మత్తయి 12:24, యోహాను 8:52 ప్రకారం సమాజం ఆయనను అర్ధం చేసుకోకపోగా ఆయనపై నిందలు వేశారు.
5.మార్కు 14:65 ప్రకారం చేయని నేరానికి బహుగా గాయపరచబడ్డారు.
6.యోహాను 5:16, మత్తయి 12వ అధ్యాయం ప్రకారం మంచి చేసినందుకు, మంచిగా ఉన్నందుకు ఆయనను హింసించారు.
నిజమే కదా, మానవ జీవితంలో మనం కూడా ఎక్కువగా అనుభవించేవి, బాధపడేవి ఇవే కదా!
ఇన్ని జీవిత అనుభవాలు కలిగివున్న యేసు క్రీస్తు వారు ఇప్పుడు ఎంత శక్తి కలిగిఉన్నారో చూద్దామా?
1.యిర్మీయా 33:3, మత్తయి 6:6 ప్రకారం నీవియూ నాతో మాట్లాడు, నేను కూడా నీతో మాట్లాడతాను అంటున్నారు.
2.యోబు 22:21 ప్రకారం ఆయనతో స్నేహం నీకు సమాధానము, మేలు జీవితంలోనికి తీసుకువస్తాయి అంటున్నారు.
3. యోహాను 6:38 ప్రకారం ఆయన వద్దకు వచ్చేవారిని ఎంతమాత్రమూ త్రోసివేయక హత్తుకుంటాను అంటున్నారు.
4. యోహాను 10:11,15 ప్రకారం నీకోసం ప్రాణంపెట్టిన పెట్టినవారిగా కనబడుతున్నారు.
5. కీర్తన 91:14-16 ప్రకారం నిన్ను అన్ని విషయములలో ఘనపరుస్తాను అంటున్నారు.
6. కీర్తన 147:3 ప్రకారం నీ గాయములు అన్నింటిని కడతాను అంటున్నారు.
7.యోహాను 5:29 ప్రకారం నీవు చేసిన మంచిపనులకి భూమిపైనా సమృద్ధి జీవం, పరమునందు నిత్యజీవం ఇస్తాను అంటున్నారు.
ఇంతగా మనలను అర్ధం చేసుకునే యేసుక్రీస్తు ఉండగా ఇక మనలను ఎవరు అర్ధం చేసుకోవాలి చెప్పండి? నన్నెవరు అర్ధం చేసుకోవడం లేదు అని దిగులెందుకు చెప్పండి, ప్రియ సహోదరి సహోదరులారా.
యేసుక్రీస్తు చెంతకి వచ్చి ఆయనను నిత్యము హత్తుకుని సంతోష సమాధాన జీవితం కలిగియుందాం. దేవుని కృప అందరికి తోడైయుండును గాక. ఆమెన్.
-Glp Rajesh Babu.

Comments
Post a Comment